కరీంనగర్‌లో కాల్పులు

4 Aug, 2018 06:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిమ్మాపూర్‌: కరీంనగర్‌ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణ కాలనీలోని బుడగ జంగాల కాలనీకి చెందిన తూర్పాటి స్వప్న(35)ను ఆమె భర్త కనకయ్య తుపాకీతో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటనలో బుల్లెట్‌ ఆమె తొడభాగం నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో  సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని విచారణ  చేపట్టారు.

నిందితుడు కనకయ్య పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తిమ్మాపూర్‌ సీఐ కరుణాకర్‌ తెలిపారు. బుడగ జంగాలకు చెందిన కనకయ్య ఇటీవలే నేపాల్‌ నుంచి వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఈ తుపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్వప్న ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. భార్యపై అనుమానం పెంచుకోవడంతో పాటు వరకట్నం కోసం వేధించినట్లు తెలిసిందని, ఆ నేపథ్యంలోనే తుపాకీతో కాల్చినట్లు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు