సెల్ఫీ చంపేసింది

21 Nov, 2017 08:43 IST|Sakshi
చల్లా వాటర్‌డ్యామ్‌, మృతుడు నరేన్‌ (ఫైల్‌)

ఐఐటీ విద్యార్థిని బలితీసుకొన్న  సెల్ఫీ సరదా

డ్యామ్‌లో ప్రమాదవశాత్తు పడి మృతి

ఉత్తరాఖండ్‌లో ఘటన

సుల్తాన్‌బజార్‌: సెల్ఫీ సరదా ఓ ఐఐటీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన ఎంజే మార్కెట్‌కు చెందిన నరేన్‌(20) ఉత్తరాఖండ్‌లోని చల్లా వాటర్‌డ్యామ్‌ వద్ద  సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులోపడి మృతి చెందాడు. ఈ నెల 18న డ్యామ్‌లోపడి గల్లంతు కాగా  సోమవారం మృతదేహం దొరికింది. వివరాలు.. మాధవి, రాజేంద్రమోహన్‌ దంపతులు మోజంజాహి మార్కెట్‌లో నివాసముంటున్నారు. రాజేంద్రమోహన్‌ జూబ్లీహిల్స్‌లోని శౌర్యభవన్‌లో స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నరేన్‌ ఒక్కగానొక్క సంతానం. ఢిల్లీలో ఐఐటీ ప్రథమ సంవత్సరం చదువుతున్న నరేన్‌ తన 8 మంది స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బయలు దేరారు.

ఈ నెల 18న ఉత్తరాఖండ్‌లోని చెల్లా డ్యామ్‌ వద్ద సరదాగా సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. రంగంలోకి దిగిన పోలీసులు  గాలింపు చర్యలను విస్తృతం చేశారు. మూడు రోజుల తరువాత పోలీసులు నరేన్‌ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నరేన్‌ మృతితో ఎంజేమార్కెట్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి.

>
మరిన్ని వార్తలు