మద్యంసేవించి ఐఏఎస్‌ డ్రైవింగ్‌.. జర్నలిస్ట్‌ మృతి

3 Aug, 2019 13:22 IST|Sakshi
బషీర్‌ (ఫైల్‌ఫోటో)

తిరువనంతపురం: మద్యం సేవించే కారు ప్రమాదం చేసిన ఐఏఎస్‌ అధికారి ఓ జర్నలిస్ట్‌ మృతికి కారణమయ్యాడు. మితిమీరిన వేగంతో కారును నడిపి ఓ జర్నలిస్ట్‌ ప్రాణాన్ని బలిగొన్నాడు. కేరళకు చెందిన శ్రీరామ్‌ వెంకటరామన్‌ అనే ఐఏఎస్‌ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్‌’ బ్యూరో ఛీఫ్‌ మహమ్మద్‌ బషీర్‌(35) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో అఫ్జా అనే  మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో  బైక్‌పై ఉన్న బషీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

వెంకటరామన్‌ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులను నమ్మిం‍చే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న స్థానికలు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు ఆ మహిళ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బషీర్‌ మృతిపై సరైన విధంగా విచారణలో జరపాలని కేరళ జర్నలిస్ట్‌ యూనియన్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. బషీర్‌ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు