పెనుకొండలో కిడ్నాప్‌ కలకలం

21 Apr, 2019 08:34 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాగభూషణ   

పెనుకొండ రూరల్‌: పెనుకొండలో శనివారం ఉదయం ఓ వ్యక్తి కిడ్నాప్‌ కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లికి చెందిన నాగభూషణం మధ్యవర్తిగా వ్యవహరిస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్ముఖం దగ్గర కోడిగుడ్ల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఆర్ముఖంకు చెల్లించాల్సిన రూ.11లక్షల లావాదేవీల్లో తేడాలు రావడంతో శనివారం ఉదయం నాగభూషణను పెనుకొండ మండలం షీఫారం సమీపంలోని నవప్రయాస మధ్యాహ్న భోజన కేంద్రం వద్ద కలిశారు.

ఈ సందర్భంగా వారి మధ్య మాటామాటా పెరిగి గొడవపడ్డారు. నాగభూషణను కొట్టి కిడ్నాప్‌ చేసి జీపులో తీసుకొని రొద్దం వైపు వెళ్లారు. సమాచారం తెలుసుకున్న రొద్దం పోలీసులు వారి కారును వెంబడించి నాగభూషణను రక్షించి అందరినీ రొద్దం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తదనంతరం పెనుకొండ స్టేషన్‌లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయమై పెనుకొండ ఎస్‌ఐ జనార్ధన్‌ను వివరణ కోరగా ఆర్థిక వ్యవహారాల వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, స్టేషన్‌లో సమస్యను పరిష్కరించుకున్నారని చెప్పారు. ఘటనపై ఎటువంటి కేసూ నమోదు చేయలేదన్నారు.

మరిన్ని వార్తలు