కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురిని అత్యంత పాశవికంగా హతమార్చాడో మానవత్వంలేని తండ్రి. పసిపాపనే కనికరం లేకుండా క్రూరంగా ఆమెను అంతమొందించాడు. వివరాలు.. షేక్ రాజు అనే వ్యక్తి తన భార్య అఫ్సారీతో కలిసి స్థానిక కోల్బెర్త్ రోడ్ ఏరియాలో నివసిస్తున్నాడు. మూడున్నర నెలల క్రితం వీరికి ఆడ శిశువు జన్మనిచ్చింది. ఆడపిల్లను కన్న కారణంగా షేక్ రాజు తరచూ భార్యతో గొడవపడే వాడు. ఈ క్రమంలో కూతురిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఇందులో భాగంగా బుధవారం చిన్నారిని తీసుకుని బయటికి వెళ్లిన రాజు ఆమెను నేలకేసి కొట్టాడు. అనంతరం చేతులు విరిచి, ముఖాన్ని ఛిద్రం చేసి దారుణంగా చంపేశాడు. కూతురి గురించి భార్య నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె కూతురి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా కూతురిని హత్య చేసినట్లు రాజు అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు చిన్నారి మృత దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.