కన్న తండ్రినే చంపాడు

16 Mar, 2019 14:17 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మధుసూదన్‌రావు, వెనుకవైపున నిందితుడు సంతోష్‌

సాక్షి, పాల్వంచరూరల్‌: కేటీపీఎస్‌లోని ఐఎం కాలనీలో ఈ నెల 9న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడిని తనయుడే కిరాతకంగా చంపాడు. పాల్వంచ సీఐ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపిన వివరాలు... 

కేటీపీఎస్‌ ఐఎం కాలనీలో నివాసముంటున్న గుగ్గిళ్ల వీరభద్రానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరభద్రాన్ని అన్‌ఫిట్‌ చేసి, అన్నదమ్ముల్లో ఒకరికి ఉద్యోగం, మరొకరికి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 9న వీరభద్రం డ్యూటీకి వెళ్లాడు. అతడు అప్పటికే మద్యం మత్తులో ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపించేశారు. ఆ రోజు రాత్రి 9.00 గంటలకు ఇంటికి వచ్చిన వీరభద్రం, వెనుక గదిలో పడుకున్నాడు. అతడి భార్య, చిన్న కుమారుడు సంతోష్‌... ముందు గదిలో నిద్రిస్తున్నారు.

తండ్రిని చంపాలని అప్పటికే సంతోష్‌ పథకం వేశాడు. కత్తి పీటతో తండ్రి వీరభద్రాన్ని మెడపై రెండువైపులా నరికి చంపాడు. ఆ తరువాత, ఇంటి వెనుక గోడను దూకి పారిపోయాడు. తన ప్రేమ వ్యవహారంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్న బంధువుపై నేరం మోపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, నిందితుడిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.  సమావేశంలో సీఐ మడత రమేష్, ఎస్సై ముత్యంరమేష్‌లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు