స్వలింగ సంపర్కానికి ఒప్పుకోలేదని స్నేహితుని హత్య

1 Nov, 2018 11:41 IST|Sakshi
ఇంజినీర్‌ దినేష్‌

ఇంజినీర్‌కు యావజ్జీవం

సాక్షి ప్రతినిధి, చెన్నై: స్వలింగ సంపర్కానికి అంగీకరించలేదని స్నేహితుడిని దారుణంగా హత్యచేసి శవాన్ని ఇంటిలోనూ పూడ్చిపెట్టిన సంఘటనలో ఇంజినీరైన దినేష్‌ అనే యువకుడికి కడలూరు కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. కడలూరు జిల్లా కోండూరుకు చెందిన సత్యమూర్తి తమిళనాడు వినియోగదారుల ఫోరంలో రిజిష్ట్రారుగా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన ఇతని కుమారుడు సతీష్‌కుమార్‌ (29) కడూరులోని ఒక కారు అమ్మకాల షోరూంలో పనిచేస్తున్నాడు. 2016 ఏప్రిల్‌ 1వ తేదీన ఉద్యోగానికని వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో నెల్లికుప్పం పోలీసు స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు.కడలూరు అన్నానగర్‌కు చెందిన దినేష్‌ అనే ఇంజినీర్‌ను పోలీసులు అనుమానించారు.

ఈ విషయం తెలుసుకున్న దినేష్‌ వీఏఓ వద్ద లొంగిపోయి సతీష్‌కుమార్‌ను తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. సంఘటన జరిగిన రోజున దినేష్‌ ఇంటిలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో స్వలింగ సంపర్కానికి సతీష్‌కుమార్‌ను దినేష్‌ ఒత్తిడిచేశాడు. ఇందుకు తీవ్రంగా అభ్యంతరం పలకడంతోపాటు ఇతర స్నేహితులకు చెబుతానని సతీష్‌కుమార్‌ బెదిరించాడు. దీంతో ఆవేశానికి లోనైన దినేష్‌ సిగిరెట్‌ తాగుదామనే నెపంతో ఇంటి వెనుకవైపునకు తీసుకెళ్లి కత్తితోపొడిచి చంపేశాడు. ఆ తరువాత శవాన్ని తన ఇంటిలోనే పూడ్చిపెట్టినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ కేసు కడలూరు జిల్లా ఫస్ట్‌క్లాస్‌మేజిస్ట్రేటు కోర్టులో న్యాయమూర్తులు గోవిందరాజన్, తిలకవతి సమక్షంలో విచారణ ముగిసింది. నిందితుడు దినేష్‌కు యావజ్జీవశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తులు మంగళవారం తీర్పు చెప్పారు.

మరిన్ని వార్తలు