ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

10 Jan, 2018 07:20 IST|Sakshi

గుంటూరు, రాజుపాలెం : ప్రేమ విఫలమై యువకుడు మృతి చెందిన సంఘటణ మండల కేంద్రానికి సమీపంలోని పచ్చల స్పిన్నింగ్‌ మిల్లు క్వార్టర్స్‌లో మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో గదిలో ఫాన్‌కు ఉరేసుకొని యువకుడు మృతి చెందాడు.  సమీపంలోని కార్మికులు చెప్పిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని బుడదాం మండలం ముక్తమల ఛపత్‌పూర్‌ గ్రామానికి చెందిన పవిత్రగౌడ్‌(21) రెండేళ్ల క్రితం వాళ్ల పెద్దమ్మ, పెదనాన్నలతో కలసి వచ్చి స్పిన్నింగ్‌ మిల్లులో మిషన్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. 

ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన యువతి కూడా అదే మిల్లులో పనిచేస్తుంది. పవిత్రగౌడ్, ఆ యువతి కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం తెలియడంతో ఆ యువతిని తీసుకొని భద్రాచలం వెళ్లిపోయారు. ప్రేమ విఫలం కావడంతో  మనస్థాపానికి గురైన పవిత్రగౌడ్‌ సోమవారం డ్యూటీకి వెళ్లకుండా గదిలోకి వెళ్లి తలుపులేసుకొని సెల్‌ ఫోన్‌లో వీడియో తీసుకుంటూ వైర్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సమీప కార్మికులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్నాడు. కిందకు దించి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల రూరల్‌ సీఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకొని గదిని, పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు