ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

21 May, 2019 11:58 IST|Sakshi
ఆత్మహత్యకు యత్నించిన వినీల, ప్రవీణ్‌

 పెళ్లికి పెద్దలు నిరాకరించారని అఘాయిత్యం

ఆదోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స

ఆదోని టౌన్‌: పెద్దలు పెళ్లికి అడ్డు చెబుతున్నారనే కారణంతో ప్రేమికులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సోమవారం ఆదోని పట్టణంలో చోటుచేసుకుంది. ఇస్వి ఏఎస్‌ఐ మోహన్‌కృష్ణ, ప్రేమికుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న లక్ష్మణ్‌ రావు పెద్దకుమారుడు ప్రవీణ్, అదే ప్రాంతంలో నివాసముంటున్న వెంకటలక్ష్మీ కుమార్తె వినీల నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో మూడేళ్ల క్రితం పెద్దలు పంచాయితీ చేసి ఇరువురిని విడదీసి ఎవరింటికి వారిని పంపారు. వినీల.. అనంతపురం హాస్టల్‌లో ఉండి డిగ్రీ సెకెండ్‌ ఇయర్‌ చదువుతోంది. ప్రవీణ్‌ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

వారం రోజుల క్రితమే ఆదోనికి వచ్చి..శిరుగుప్ప క్యాంప్‌లో ఉన్న చిన్నమ్మ అన్నపూర్ణమ్మ వద్దకు వెళ్తున్నానని ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయలు దేరాడు. హైదరాబాద్‌లో ఉన్న బంధువులు ఇంటికి వెళ్లి వస్తానని వినీలా కూడా బయలుదేరింది. వీరిరువూ సోమవారం ఆదోని మండలం సంతెకూడ్లూరు–పెద్దహరివాణం పొలాల్లో పురుగు మందు తాగారు. ఈ విషయాన్ని ప్రవీణ్‌ ఆదోనిలో ఉన్న తన స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆదోని నుంచి వారు ఆటో తీసుకొని వచ్చి బాధితులను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు.

మూడేళ్ల క్రితం తమను వేరు చేశారని, ప్రస్తుతం తాము మేజర్లమని, పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమికుల తల్లిదండ్రులు సమాచారం మేరకు విచారణ చేస్తున్నట్లు ఇస్వీ ఏఎస్‌ఐ మోహన్‌కృష్ణ తెలిపారు. 

మరిన్ని వార్తలు