పుణెలో కౌకుంట్లవాసి దుర్మరణం

20 Jun, 2019 07:17 IST|Sakshi
వంశీకృష్ణ (ఫైల్‌)

దేవరకద్ర రూరల్‌: పుణెలో వివాహంలో పాల్గొనేందుకు వెళ్లిన మండలంలోని కౌకుంట్లకు చెందిన ఓ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకోగా.. స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు, అలివేలు దంపతుల కుమారుడు వంశీకృష్ణ(29) పోస్టల్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు.

తండ్రి చిన్నప్పుడే మృతి చెందడంతో తల్లి కష్టపడి చదివించింది. గతేడాది డిసెంబర్‌ 13న నల్లగొండకు చెందిన అమ్మాయితో వంశీకృష్ణకు వివాహమైంది. అయితే ఈ నెల 15న తన తమ్ముడు నవీన్‌కృష్ణతో కలిసి ఓ వివాహంలో పాల్గొనడానికి వంశీకృష్ణ పుణె వెళ్లాడు. వివాహం అనంతరం తమ్ముడు నవీన్‌కృష్ణ, మరో నలుగురితో కలిసి మంగళవారం కారులో తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు పుణె శివారులో ఆగి ఉన్న వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంశీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా.. తమ్ముడు నవీన్‌కృష్ణకు గాయాలయ్యాయి. వంశీకృష్ణ మృతదేహాన్ని బుధవారం స్వగ్రామమైన కౌకుంట్లకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు