‘సరదా కోసం ఉగ్రవాద సంస్థ పేరు పెట్టా’

18 Feb, 2019 18:28 IST|Sakshi

సాక్షి, ముంబై: యావత్‌ దేశం ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ కుర్రాడు చేసిన తుంటిరి పనితో నగరంలోని కళ్యాణ్‌ ప్రాంతంలో కలకలం సృష్టించింది. తన వై ఫై నెట్‌వర్క్‌ పేరును లష్కరే తాలిబన్‌ అని పెట్టుకోవడంతో ఆ కుర్రాడు చిక్కుల్లో పడ్డాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఓ అపార్ట్‌ మెంట్‌లోని కొంతమంది వై ఫై నెట్‌వర్క్స్‌ గురించి సెర్చ్‌ చేస్తే ఆ జాబితాలో ఉగ్రవాద సంస్థ పేరు ఉండటం చూసి భయాందోళనలకు గురయ్యారు. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే కేసును ఛేదించారు. అపార్ట్‌మెంట్‌కు చెందిన కుర్రాడే కావాలనే ఉగ్రవాద సంస్థ పేరు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని విచారించగా.. ఉగ్రవాద సంస్థలతో అతడికి ఎలాంటి సంబంధంలేదని, కేవలం వై ఫై నెట్‌వర్క్‌ను ఎవరు వాడకూడదనే ఉద్దేశంతోనే సరదాగా ఆ పేరు పెట్టినట్లు పోలీసులకు వివరించారు. అయితే వెంటనే ఆ పేరును మార్చాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అతడిని హెచ్చరించారు.         
 

మరిన్ని వార్తలు