నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు

23 May, 2020 08:11 IST|Sakshi
మృతుడు శ్రీధర్‌ (ఫైల్‌ ఫోటో)

ఆటోతో ఢీకొట్టి.. కత్తితో పొడిచి.. 

చెల్లెలిని ప్రేమించాడని యువకుడి హత్య  

జనగామ జిల్లాలో దారుణం 

బచ్చన్నపేట: ఇద్దరూ క్లాస్‌మేట్స్‌.. కలసి చదువుకున్నారు.. ఆ రకంగా ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ఈ ప్రేమ యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది.. దీంతో కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు.. చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్‌ కమాన్‌ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?)

కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్‌ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్‌లో చదివించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్‌ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్‌ (22) హైదరాబాద్‌లోనే ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కావడంతో ఇద్దరూ కొడవటూర్‌ గ్రామంలోనే ఉంటున్నారు. (బెంగాలీ కుటుంబం.. విషాదాంతం)

నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు 
ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్‌తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్‌ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్‌ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్‌పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్‌ వెళుతున్న అతడిని  యువతి సోదరుడు శివకుమార్‌ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్‌ రోడ్డుపై కమాన్‌ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.  

మరిన్ని వార్తలు