విద్యుదాఘాతానికి వ్యక్తి బలి.. 

26 Jun, 2018 13:23 IST|Sakshi
 ప్రాణాలతో బయటపడిన అంజమ్మ  

ప్రాణాలతో బయటపడిన మహిళ 

తీగపై దుస్తులు ఆరేస్తుండగా ఘటన

కొల్లూరు గ్రామంలో విషాదఛాయలు

నవాబుపేట(జడ్చర్ల) : రొట్టే ముక్క చేత పట్టుకుని.. తినేందుకు చేతిని లేపగానే.. ఇంతలో  పక్కింటి మహిళ కేకలు వినిపించాయి. వెంటనే రొట్టె ముక్కను అక్కడే పడేసి పరుగున వెళ్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళను కాపాడాడు. కానీ ఈ ప్రమాదంలో బలైపోయాడు ఓ వ్యక్తి.. ఈ విషాదకర సంఘటన మండలంలోని కొల్లూరులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ సోమవారం ఉదయం దుస్తులు ఉతికి ఇంటి ముందున్న తీగ ఆరేస్తోంది. ఇంతలో విద్యుత్‌ వైరు తీగకు తగలడంతో షాక్‌కు గురై కేకలు వేసింది. వెంటనే పక్కింట్లో రొట్టె తింటున్న ముష్టి కృష్ణయ్య(45) మహిళ కేకలు వినిపించగానే రొట్టెను పక్కన పెట్టేసి వెంటనే మహిళను కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో తాను విద్యుదాఘాతానికి షాక్‌కు అక్కడికక్కడే కన్నుమూశాడు.  

అపస్మారక స్థితిలో నుంచి.. 

విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలో ఉన్న అంజమ్మను గమనించిన వాసుయాదవ్‌ అనే వ్యక్తి ఆమెకు ఊపిరి ఆగిపోకుండా చేతులతో మోది స్పృహ వచ్చేలాచేశాడు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడింది.

కాపాడేందుకు వెళ్లిన కృష్ణయ్య విద్యుదాఘాతానికి గురై మృతిచెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంగానే విద్యుత్‌ తీగలు, ఎర్త్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు