లక్నో : ఫోన్లో భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన యూపీకి చెందిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇవ్వలేదని తన కుమార్తెను ఆడపడుచులు, అత్తింటి వారు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని, సౌదీ అరేబియాలో నివసించే తన అల్లుడు ఫోన్ ద్వారా తన కుమార్తెకు విడాకులు ఇచ్చాడని బాధితురాలి తల్లి ఆరోపించారు.
అత్తింటి వేధింపులతో విసిగిపోయిన తన కుమార్తెను పుట్టింటికి తీసుకువచ్చామని, అయినా వారు కట్నం తీసుకురావాలని వేధిస్తన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ నుంచి తమ అల్లుడు తన కుమార్తెకు ఫోన్లో తలాక్ చెప్పాడని తమకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని బాధితురాలి తల్లి రేష్మా డిమాండ్ చేశారు.
ఎనిమిది నెలల కిందట తనకు వివాహమైందని, కట్నం కింద రూ 50 వేల నగదు, మోటార్ బైక్ తీసుకురావాలని తన అత్త తనను కొడుతోందని బాధితురాలు నూరి వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం నిందితులపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు.