మొబైల్‌ చోరీ; రైల్లో నుంచి దూకి..

31 Aug, 2018 20:04 IST|Sakshi

ముంబై: ఓ వ్యక్తి చోరి అయిన మొబైల్‌ ఫోన్‌ కోసం రైల్లో నుంచి దూకి ప్రాణాలు కొల్పోయాడు. ఈ ఘటన ఆగస్టు 19వ తేదీన మహారాష్ట్రలోని కాల్వా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాసిక్‌కు చెందిన చేతన్‌ అహీర్‌రావు సెంట్రల్‌ రైల్వేస్‌ లోకల్‌ ట్రైన్‌లో ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్‌ కాల్వా స్టేషన్‌ నుంచి కదులుతున్న సమయంలో అజయ్‌ సోలాంకి అనే వ్యక్తి చేతన్‌ మణికట్టుపై దాడి చేసి అతని మొబైల్‌ తీసుకుని పరిగెత్తాడు. తన ఫోన్‌ కోసం కదులుతున్న ట్రైన్‌లో నుంచి కిందకు దూకిన చేతన్‌ పట్టాలపై పడిపోయాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కొల్పోయాడు.

ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. తొలుత చేతన్‌ది అనుమానస్పద మృతిగా భావించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ చూసిన తర్వాత మొబైల్‌ దొంగతనం జరిగినందు వల్లే చేతన్‌ ట్రైన్‌ నుంచి దూకినట్టు నిర్ధారించుకున్నామని పేర్కొన్నారు. నిందితుడిని కాల్వా స్టేషన్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. గతంలో కూడా అజయ్‌పై పలు చోరీ కేసులు ఉన్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు