కూకట్‌పల్లిలో దారుణం

7 Oct, 2017 09:24 IST|Sakshi

విద్యార్థిని దారుణ హత్య
 

సాక్షి, హైదరాబాద్‌: జీడిమెట్లలో డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్ధిని దారుణ హత్యకు గురైంది. 19 ఏళ్ల విద్యార్ధిని సౌమ్యను కృష్ణయ్య అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. మృతదేహాన్ని కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువులో పడేసిన కృష్ణయ్య అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

సౌమ్యకు బావ వరుస అయ్యే కృష్ణయ్య.. బోరబండ పర్వతనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికి పెళ్లి చేయాలని గతంలో కుటుంబసభ్యులు నిర్ణయించారు. సౌమ్య చింతల్‌లోనే ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో.. సౌమ్య మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని కృష్ణయ్య జీర్ణించుకోలేకపోయాడు. మాట్లాడాలంటూ శుక్రవారం ఉదయం ఆ అమ్మాయిని హెచ్‌ఎంటీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశానికి రమ్మన్నాడు. మాట్లాడుతుండగా మాటామాట పెరిగి కోపంతో కొట్టడంతో.. సౌమ్య అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని సంచిలో కట్టుకుని తన వాహనంలో తీసుకువచ్చి కూకట్‌పల్లి ఐడిఎల్‌ చెరువులో పడవేశాడు. అనంతరం పర్వత్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లి సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.


కాగా, కాలేజీకి వెళ్లిన సౌమ్య సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కృష్ణయ్య లొంగిపోవడంతో సౌమ్య హత్య గురించి వెలుగులోకి వచ్చింది.

అనుమానంతోనే..
సౌమ్య ప్రవర్తనపై అనుమానంతో హత్య చేసినట్టు నిందితుడు కృష్ణయ్య ఒప్పుకున్నట్టు ఏసీపీ గోవర్ధన్‌ తెలిపారు. సౌమ్య ఛాతిపై బలంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. నిన్న ఉదయం తొమ్మిదున్నర... 10గంటల మధ్యలో హత్య జరిగినట్టు గుర్తించామన్నారు. నిందితుడిని కూకట్‌పల్లి పోలీసులు.. జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. జీడిమెట్ల పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మొన్న మియాపూర్‌లో ఇంటర్‌ విద్యార్థిని హత్య నేపథ్యంలో తాజాగా విద్యార్థిని సౌమ్య హత్య నగరంలో కలకలం రేపుతోంది.

మరిన్ని వార్తలు