అత్యాచారం చేయబోయి హతమయ్యాడు!

16 Aug, 2018 14:14 IST|Sakshi
మృతిచెందిన గొళ్ల విజేయుడు

కర్నూలు సీక్యాంప్‌: ఫూటుగా మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తున్న మహిళను బలాత్కారం చేయిబోయి ఓ వ్యక్తి హతమయ్యాడు. ఈ ఘటన బుధవారం కర్నూలు మండలం నిడ్జూరు గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకా సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజేయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది.

తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఫూటుగా మద్యం తాగి..భర్తలేని సమయాన్ని చూసుకొని బుధవారం ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించగా...గదిలో ఉన్న రోకలిబండను తీసుకుని విజేయుడు తలమీద బలంగా కొట్టింది. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో గొళ్ల విజేయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆమె అక్కడి నుంచి పరారైంది. ఉదయం తాలూకా పోలీసులకు సమాచారం అందడంతో సీఐ వెంటరమణ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు.   

>
మరిన్ని వార్తలు