రోడ్డుపై జ్యోతిష్కుడి దారుణ హత్య

28 May, 2019 10:02 IST|Sakshi

సాక్షి, చెన్నై ‌: రిపబ్లిక్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో నిందితులుగా భావిస్తున్న మహిళ సహా నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కోవై ఆర్‌ఎస్‌ పురం సమీపంలోని కుమార స్వామి కాలనీ ప్రాంతానికి చెందిన సంతోష్‌ కుమార్‌ (26) జ్యోతిష్కుడు. ఇండియన్‌ రిపబ్లిక్‌ పార్టీకి చెందిన ఇతను ఇటీవల బీజేపీలో చేరాడు. ఆదివారం ఉదయం అదే ప్రాంతానికి చెందిన రిపబ్లిక్‌ పార్టీకి చెందిన ఎరిమేడు ఆరుముగం, గుండు రమేష్, సెంథిల్, కరుణ్, అనే నలుగురు సంతోష్‌ కుమార్‌ ఇంటికి వెళ్లి మళ్లీ రిపబ్లిక్‌ పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. దీన్ని సంతోష్‌ కుమార్‌ అంగీకరించలేదు. దీంతో వారు సంతోష్‌ కుమార్‌పై హత్యా బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో ఆందోళన చెందిన సంతోష్‌ కుమార్‌ తల్లి ప్రేమ, చెల్లెలు లక్ష్మీ ఆదివారం మధ్యాహ్నం ఆర్‌ఎస్‌ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్న క్రమంలో ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు సంతోష్‌ కుమార్‌ వీర కేరళం బస్టాండ్‌ వద్ద నిలుచుని ఉండగా, అటువైపుగా బైక్‌లో వచ్చిన మహిళ సహా నలుగురు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ప్రశ్నించారు. ఆ సమయంలో ఏర్పడిన ఘర్షణలో ఓ వ్యక్తి తన వద్దనున్న కత్తితో సంతోష్‌ కుమార్‌ మెడపై దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగులో సంతోష్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న  వడవల్లి పోలీసులు సంతోష్‌ కుమార్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దీని గురించి కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. మహిళ సహా నలుగురి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు