వివాహిత బలవన్మరణం

4 Sep, 2018 11:33 IST|Sakshi
శైలజ మృతదేహం

కర్నూలు, ఆదోని టౌన్‌: ఆదోని పట్టణంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. త్రీ టౌన్‌ ఎస్‌ఐ రామ్‌నాయక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన బుజ్జమ్మ కూతురు శైలజ అదేవీధిలో నివాసముంటున్న టైలర్‌ పంపాపతి ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరుకావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలూ నిరాకరించాయి. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి 2017 జూన్‌ 15న పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికే ఆదోనికి వచ్చి బండిమిట్ట వీధిలో ఓ ఇల్లుకు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. వీరికి ఓ బాబు జన్మించాడు. భర్త ఎమ్మిగనూరు రోడ్డులోని ఓ క్వారీలో పనిచేస్తూ భార్య, కొడుకును పోషిస్తున్నాడు. యథావిధిగా సోమవారం విధులకు వెళ్లాడు.

అరగంటకే తాను చనిపోతున్నానని, కొడుకుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, బాగా చదివించి ప్రయోజకుడిని చేయాలని భార్య శైలజ (24) నుంచి తన ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. కంగారు పడి ఇంటి చుట్టుపక్కల వారికి సమాచారం అందించి అతడూ వెనక్కి వచ్చాడు. వారు వెళ్లి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో త్రీటౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

వేధింపులు భరించలేననని ఫోన్‌ చేసి చెప్పింది..
తన భర్త అనుమానంతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, ఇక కాపురం చేయడం తన వల్ల కాదని ఉదయం ఫోన్‌ చేసి చెప్పిందని శైలజ తల్లి బుజ్జమ్మ బోరున విలపించింది. తన కూతురిని అల్లుడే హత్య చేసి, ఆత్మ హత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

మరిన్ని వార్తలు