ముజఫర్నగర్ : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కీచక తండ్రి కన్నకూతురిపై సాగించిన పైశాచిక దాడి వెలుగుచూసింది. బుధానా పట్టణంలో ఆరు నెలలుగా మైనర్ కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ బాధితురాలి తల్లి కంటపడ్డాడు. కంటికిరెప్పలా కాపాడాల్సిన కూతురుపై తాను చేస్తున్న ఘోరం బయటపడటంతో నిందితుడు తల్లీకూతుళ్లను బెదిరించాడు.
దారుణానికి తెగబడ్డ తండ్రిపై బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపడతామని ముజఫర్నగర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపారు.