అంతా అనుకున్నట్లే జరిగింది...

14 Jul, 2018 11:53 IST|Sakshi

లాహోర్‌: అవెన్‌ ఫీల్డ్‌ కేసులో జైలు పాలైన పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కూతురు మర్యమ్‌లు అప్పుడే ఒకరోజు జైలు జీవితం గడిపేశారు. లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే నవాజ్‌ను అదుపులోకి తీసుకుని నేరుగా రావల్పిండిలోని అదియాలా జైల్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఆయనకు బీ క్లాస్‌ ట్రీట్‌మెంట్‌ను అందిస్తున్నట్లు సమాచారం.

బీ క్లాస్‌ వసతులు.. పాక్‌లో నేరం తీవ్రత ఆధారంగా జైల్లో సదుపాయాల కల్పన ఉండదు. ఎంతటి నేరాలు చేసినా.. సోసైటీలో అప్పటిదాకా వారికి ఉండే హోదా, వారి ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు ఆధారంగానే ట్రీట్‌మెంట్‌ అందుతుంది. అయితే ఏ క్లాస్‌ కాకుండా బీ క్లాస్‌ గదులను నవాజ్‌కు కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. గదిలో ఓ మంచం, ఓ కుర్చీ, చెంబు, మరుగుదొడ్డి సదుపాయం మాత్రమే ఉంటాయి. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే.. గదిలో ఫ్రిజ్‌, ఏసీ, టీవీ సదుపాయాలను కల్పిస్తారు.  అయితే మరియమ్‌కు  మాత్రం ఊరటనిచ్చిన అధికారులు.. సీహాలా రెస్ట్‌ హౌజ్‌కు తరలించి తాత్కాలిక సబ్‌జైలును ఏర్పాటు చేశారు. జైల్లో నవాజ్‌కు బీ కేటగిరీ సదుపాయాలు కల్పించటంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) కార్యకర్తలు మండిపడుతున్నారు.

పనామా పత్రాలు, అవినీతి కేసుల్లో, లండన్‌లో అక్రమాస్తుల సంపాదన.. తదితర ఆరోపణలు రుజువు కావటంతో అకౌంటబిలిటీ కోర్టు.. నవాజ్‌ షరీఫ్‌(68)కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్‌(44) ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. షరీఫ్‌ భార్య అనారోగ్యం కారణంగా లండన్‌లోనే కుటుంబం ఎక్కువగా గడుపుతోంది. అయితే జూలై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఆయన, మర్యమ్‌లు తిరిగి శుక్రవారం స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ పరిస్థితుల మధ్య అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు అరెస్ట్‌ చేసి.. జైలుకు తరలించారు. అరెస్ట్‌కు ముందే షరీఫ్‌ తనపై చేస్తున్న కుట్రను వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్‌ చేయటం తెలిసిందే.

మరిన్ని వార్తలు