బిగ్‌బాస్‌ అయ్యాక కాల్‌ చేస్తానంది.. అంతలోనే

17 Nov, 2018 11:03 IST|Sakshi

న్యూఢిల్లీ : అప్పటికి గంట నుంచి నా సోదరి నాతో ఫోన్‌లో మాట్లాడుతుంది. నా కూతురితో మాట్లాడమన్నాను.. బిగ్‌బాస్‌ అయిపోయాక కాల్‌ చేస్తానని చెప్పింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది అంటూ విలపిస్తున్న ఆ మహిళను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఢిల్లీకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ మాలా లఖానిని అత్యంత దారుణంగా చంపారు దుండగులు. వివరాలు.. మాలా లఖాని అనే మహిళ ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తోంది. రాహుల్‌ అన్వర్‌(24) అనే యువకుడు మాలా దగ్గర మాస్టర్‌ టైలర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ మైనర్‌ బాలికను వేధించిన కేసులో రాహుల్‌ జైలు కెళ్లాడు. మాలానే డబ్బు కట్టి రాహుల్‌కి బెయిల్‌ ఇప్పించింది. బయటకు వచ్చిన రాహుల్‌ తిరిగి మాల దగ్గర పనికి చేరాడు. తాను డిజైన్‌ చేసిన ‍ప్రతి డ్రెస్‌ మీద ఎక్స్‌ట్రా డబ్బులు ఇవ్వాల్సిందిగా మాలాను డిమాండ్‌ చేసేవాడు. అందుకు మాలా ఒప్పుకోలేదు. దాంతో కక్ష్య పెంచుకున్న రాహుల్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మాలాను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ దాడిలో అడ్డువచ్చిన పని మనిషిని కూడా హత్య చేశారు.

ఈ దారుణం బుధవారం రాత్రి 10 - 11.30 గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. నా సోదరి రాహుల్‌ని తన కొడుకుగా భావించేది. కానీ డబ్బు కోసం అతను ఇంత దారుణానికి తెగించాడని వాపోయింది మాలా సోదరి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాలా సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రాహులతో పాటు అతని స్నేహితులను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు