ప్రాణం మీదకు తెచ్చిన  టిక్‌టాక్‌

22 Sep, 2019 04:35 IST|Sakshi
గల్లంతవడానికి ముందు చెక్‌డ్యాం వద్ద చివరి టిక్‌టాక్‌ వీడియోలో దినేష్‌

వరద నీటిలో యువకుడి గల్లంతు

ఇద్దరిని కాపాడిన స్థానికులు

భీమ్‌గల్‌: టిక్‌టాక్‌ మోజు ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం గోన్‌గొప్పుల్‌ గ్రామ శివారులో గల కప్పలవాగు పొంగిపొర్లుతోంది. చెక్‌డ్యాం నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు గ్రామానికి చెందిన ఇంద్రపురం దినేశ్‌ (22) ఇద్దరు స్నేహితులు గంగాజలం, మనోజ్‌గౌడ్‌తో కలసి శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ముగ్గురు వరద నీటిలోకి దిగి టిక్‌టాక్‌ వీడియోలు తీసుకున్నారు. అనంతరం చేపలు పట్టారు.తర్వాత ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో స్నేహితులు నీటిలో కొట్టుకుపోసాగారు. ఒడ్డున ఉన్నవారు గమనించి చీరలను విసరడంతో మనోజ్, గంగాజలంను తీసుకొని బయటకు వచ్చాడు. వరదకు ఎదురీదుతూ వాగు మధ్యలోకి వెళ్లిన దినేశ్‌ గల్లంతయ్యాడు. అతడి కోసం అధికార యంత్రాంగం 24 గంటల నుంచి గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు.  ఇంద్రపురం చిన్న గంగారం, లక్ష్మి దంపతుల ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన దినేశ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లి 3 నెలల క్రితం  తిరిగి వచ్చాడు. నెలరోజుల్లో దుబాయ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘోరం జరిగిపోయింది.

మరిన్ని వార్తలు