విజయనగరంలో ఆపరేషన్‌ రెడ్‌

7 Feb, 2018 08:03 IST|Sakshi
స్వాధీనం చేసుకుంటున్న ఎర్రచందనం దుంగలు

భారీ ‘ఎర్ర’ డంప్‌ స్వాధీనం

రూ.కోట్ల విలువైన దుంగలు సీజ్‌

చిత్తూరు పోలీసుల అదుపులో స్మగ్లర్లు

చిత్తూరు అర్బన్‌ : ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరి కట్టడానికి చిత్తూరు పోలీసు జిల్లాలో ఏర్పాటైన ఆపరేషన్‌ రెడ్‌ విభాగం విజయనగరంలో ఓ భారీ డంప్‌ను స్వాధీనం చేసుకుంది. రూ.కోట్లు విలువజేసే ఎర్రచందనం డంప్‌ను విజయనగరం జిల్లాలో గుర్తించిన చిత్తూరు పోలీసులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని వెనుక ఉన్న ఓ బడా స్మగ్లర్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు.. పూతలపట్టు సమీపంలో మూడు రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ మినీలారీలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధిం చి నిందితులను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో విజయనగరం జిల్లాకు చెందిన ఓ బడా వ్యక్తి పేరు బయటపెట్టారు. ఈ విషయంపై ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని .. ఓ ప్రత్యేక బృందాన్ని విజయనగరం పంపుతూ చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. పూతలపట్టులో పట్టుబడ్డ చోటా స్మగ్లర్‌ను వెంటపెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున చిత్తూరు పోలీసులు విజయనగరం చేరుకున్నారు. అక్క డ భారీగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్‌ను గుర్తించారు.

టన్ను రూ.35 లక్షల వరకు పలికే ఏ–గ్రేడ్‌ ఎర్రచందనం దుంగలు డంప్‌లో ఉన్నట్లు సమాచారం. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.5 కోట్లకుపైగా ఉండొచ్చని సమాచారం. కాగా దుంగలు పట్టుబడ్డ డంప్‌ ప్రాంతంలో ముగ్గురిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎర్రచంద నం దుంగలు దొరికిన స్థల యజమా నితో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారు. అయితేఅనూహ్యంగా వీరి వెనుక ఓ అంతర్జాతీయ బడా స్మగ్లర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు. అతడిని పట్టుకోవడానికి విజయనగరం పోలీసులతో కలిసి చిత్తూరు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడున్న అన్ని ప్రధాన చెక్‌పోస్టులపై నిఘా ఉంచారు. మరో రెండు రోజుల పాటు అక్కడే ఉండి పట్టుబడ్డ డంప్‌తో పాటు నిందితులను చిత్తూరుకు తీసుకురానున్నారు.

శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం
భాకరాపేట /తిరుపతి మంగళం : శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్‌ రఘునాథ్‌ తెలిపారు. మంగళవారం భాకరాపేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు, సిబ్బంది, ప్రొటెక్షన్‌ వాచర్లు, పైర్‌ వాచర్లు కలసి నాలుగు రోజులుగా కూంబింగ్‌ చేస్తున్నారని,  సోమవారం పెరుమాళ్లపల్లె బీట్‌ పరిధిలోని మేకలబండ ప్రాంతంలో ఎదురుపడ్డ తమిళ స్మగ్లర్లను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడేసి పరారయ్యారని తెలిపారు. అక్కడ 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  అలాగే మంగళవారం 50 దుంగలు ఉన్న డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు