ప్రేమించిందని ప్రాణాలు తీసిన తల్లిదండ్రులు

1 Oct, 2018 08:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌: రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిందనే కారణంతో కని పెంచిన తల్లిదండ్రులే తమ కూతురికి నిప్పంటించి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్‌లోని జైపూర్‌కి సమీపంలోని ఫగీ గ్రామానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన ఓ బాలుడ్ని ప్రేమించింది. ఇది సహించలేకపోయిన బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఆమెకు నిప్పంటించి సజీవ దహనం చేశారు. అంతేకాకుండా తమ కూతురికి పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్లే ఆత్మహత్యకు పాల్పండిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదుపై అనుమానం రావడంతో పోలీసులు ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

ఫోరెన్సిక్‌ నిపుణల సహాయంతో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు.. చివరకు అది ఆత్మహత్య కాదని నిర్ధారణకు వచ్చారు. తగిన ఆధారాలు సేకరించి బాలిక తల్లిదండ్రులను విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. ‘మా కూతురు ఓ వ్యక్తిని ప్రేమించడంతో.. గ్రామస్థులు తమ పెంపకం గురించి చాలా రకాలుగా మాట్లాడేవారు. దీంతో మా పరువు నిలుపుకోవడం కోసమే బాలికను హత్య చేశామ’ని  బాలిక తల్లిదండ్రులు పోలీసుల విచారణలో తెలిపారు.
 

మరిన్ని వార్తలు