చిలుక నోటి వెంట బాధితురాలి చివ‌రి మాటలు

26 May, 2020 14:22 IST|Sakshi

వాషింగ్టన్: అత్యాచార కేసులో చిలుక సాక్ష్యంగా మార‌నుంది. త‌న య‌జ‌మానురాలి చివ‌రి మాట‌ల‌ను నోటి వెంట ప‌లుకుతూ ఆమె చావుకు కార‌ణ‌మైన వారిని క‌ట‌క‌టాల వెన‌క్కు నెట్ట‌నుంది. ఈ అరుదైన ఘ‌ట‌న  అర్జెంటీనాలో చోటు చేసుకుంది. సాన్ ఫెర్నాడోకు చెందిన‌ ఎలిజ‌బెత్ టోలెడొ అనే మ‌హిళ ఇంటిపైభాగంలో ముగ్గురు వ్య‌క్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్ద‌రు దుండ‌గులు అద్దెకిచ్చిన మ‌హిళ‌పైనే క‌న్నేశారు. 2018 డిసెంబ‌‌ర్‌లో ఓ రోజు ఆమెను అత్యంత‌ దారుణంగా అత్యాచారం చేసి చంపారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోగా వారికి "ప్లీజ్‌, న‌న్ను వ‌దిలేయండి" అంటూ అర్థిస్తున్న శ‌బ్ధాలు వినిపించాయి. శ‌బ్ధాల ఆధారంగా ఇంట్లోకి వెళ్లి చూడ‌గా.. న‌గ్నంగా, విగ‌త‌జీవిగా ప‌డి ఉన్న మ‌హిళ శ‌వం ప‌క్క‌న బోనులో ఉన్న‌ చిలుక ప‌లుకులు వినిపించాయి. (యాజమాని వద్దు! స్వేచ్ఛే ముద్దు)

మ‌హిళ‌ను హింసిస్తూ, అత్యాచారం చేసిన‌ప్పుడు ఆమె వేడుకున్న ఆర్త‌నాదాల‌ను చిలుక గ్ర‌హించి వాటినే ఉచ్ఛ‌రించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక‌ ఈ ఘ‌ట‌న క‌న్నా ముందు నిందితులు ఇంట్లోకి చొర‌బడిన వెంట‌నే చిలుక "‌న‌న్ను ఎందుకు కొడుతున్నారు?" అంటూ య‌జ‌మాని మాట‌ల‌ను తిరిగి ప‌లికింది. ఈ మాట‌ల‌ను తాము చెవులారా విన్నామంటూ ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో చిలుక ప‌లుకుల‌ను సాక్ష్యంగా చేర్చారు. మ‌రోవైపు పోస్టుమార్టంలోనూ బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపిన‌ట్లు వెల్ల‌డైంది. కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. త్వ‌ర‌లోనే కేసు విచార‌ణ‌కు రానుండ‌గా చిల‌కను సాక్ష్యంగా కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు

మరిన్ని వార్తలు