అత్యాచారం చేసి..  ఆపై పెట్రోల్‌ పోసి! 

1 Mar, 2020 03:42 IST|Sakshi

సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి, అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడో ప్రేమోన్మాది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తిరుమలగిరి ఎస్సై డానియెల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవాపురం గ్రామానికి చెందిన భూక్య వెంకన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కూతురి వివాహం కాగా, రెండో కూతురు (17) మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని మమత పారా మెడికల్‌ కాలేజీలో చదువుకుంటోంది. భూక్య వెంకన్న తన భార్యతో కలసి హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇదే గ్రామానికి చెందిన గుగులోతు వెంకటేశ్‌ ఇంటర్‌ పూర్తిచేసి ట్రాక్టర్‌ నడుపుకుంటున్నాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని రెండేళ్లుగా యువతిని వేధిస్తున్నాడు. యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. అమ్మాయి జోలికి వెళ్లొద్దని హెచ్చరించి వదిలేశారు. ఈ విషయంలో కక్ష కట్టిన వెంకటేశ్‌ శుక్రవారం రాత్రి అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు యువతిని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
  

మరిన్ని వార్తలు