పథకం ప్రకారం అంతమొందించారు!

5 Jun, 2020 10:40 IST|Sakshi
మృతుడు క్రిష్ణ (ఫైల్‌)

అదృశ్యమై శవంగా మారిన యువకుడు

రైల్వేట్రాక్‌పై మృతదేహం

తెలిసిన వాళ్లే హత్యచేసి ఉంటారనే అనుమానం

రాళ్లతో కొట్టి పెట్రోల్‌పోసి నిప్పంటించారు

బన్సీలాల్‌పేట్‌:  బన్సీలాల్‌పేట్‌కు చెందిన యువకుడు అదృశ్యమై చివరకు రైల్వేట్రాక్‌పై శవంగా తేలాడు. అతనిని రాళ్లతో కొట్టి పెట్రోల్‌పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హత్యచేశారు. తెలిసిన వారి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు..  బన్సీలాల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన జె. క్రిష్ణ(22) ఈనెల 31న అదృశ్యమయ్యాడు. రైల్వేలో ఔట్‌ సోర్సింగ్‌ విభాగంలో ఇతను పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిన క్రిష్ణ తిరిగి రాకపొవడంతో తల్లి  నాగమ్మ  ఈ నెల 2న గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  రైల్వే ట్రాక్‌ పక్కన చెట్ల పొదల్లో  యువకుడి శవం పడి ఉందనే సమాచారం మేరకు ఈ నెల 3పరాత్రి  గాంధీనగర్, మహాంకాళి పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌. శ్రీనివాస్‌రావు, కావేటి శ్రీనివాసులు అక్కడికి చేరుకుని సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. మిస్టరీని చేదించడానికి  ప్రత్యేకంగా పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.

పథకం ప్రకారమే హత్య?
మృతుడు క్రిష్ణకు రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం ఏరుకొని గంజాయి సేవించే జులాయిలు పలువురితో పరిచయం ఉంది. ఈ బృందమే   పథకం ప్రకారం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.  క్రిష్ణ స్నేహితుడు శ్రావణ్‌ను నిందితుల్లో కొందరు కలిసి కొట్టి బెదిరించారు. ఈ విషయాన్ని శ్రావణ్‌ వచ్చి క్రిష్ణతో చెప్పాడు. దాంతో క్రిష్ణ నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  బెదిరించి ...మీ పని చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం.  దీంతో క్రిష్ణపై కక్ష పెంచుకున్న ఐదుగురు పథకం ప్రకారం  ఈ నెల 31న క్రిష్ణను రైల్వే ట్రాక్‌ వద్దకు పిలిపించుకున్నారు. మద్యం మత్తులో అందరి మధ్య వాగ్వివాదం...ఘర్షణ జరిగినట్లు తెలిసింది. క్రిష్ణను రాళ్లతో కొట్టి అంతమొందించి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ అతనిపై పొసి నిప్పంటించి పరారైనట్లు తెలుస్తోంది.  నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఈ హత్య తెలిసిన వారి పే అయి ఉంటుందని  ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు విలేకరులతో పేర్కొన్నారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు