అనుమానిస్తోందని అంతం చేశాడు..! 

14 Aug, 2018 01:50 IST|Sakshi
నిందితుడు ఆంజనేయ రెడ్డిని అరెస్ట్‌ చేసి తీసుకెళుతున్న గచ్చిబౌలి పోలీసులు, లక్ష్మీ వినీల (ఫైల్‌)

భార్యను హత్య చేసిన రిటైర్డ్‌ ఎస్‌ఐ 

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు 

అక్రమ సంబంధం,డబ్బు వివాదమే కారణం!

హైదరాబాద్‌: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానించిన భార్యను అంతమొందించాడు ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని భాస్కర్‌రావు పేటకు చెందిన కె.ఎస్‌.ఆర్‌. ఆంజనేయరెడ్డి(61), లక్ష్మీ వినీల(51) దంపతులు. ఆంజనేయరెడ్డి ఏలూర్‌ రేంజ్‌లో వీఆర్‌ విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశా రు. రెండు నెలల క్రితం దంపతులు కొండాపూర్‌ గౌతమీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే కొడుకు శివమనోహర్‌రెడ్డి వద్దకు వచ్చారు. కొడుకు అత్తవారింటికి వెళ్లడంతో ఫ్లాట్‌లో ఆ దంపతులిద్దరే ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున వినీలను ఆంజనేయరెడ్డి విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. రక్తం కనిపించకుండా బెడ్‌రూమ్‌ శుభ్రం చేసి ఉదయం 5.30 గంటల సమయం లో మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.  

అక్రమ సంబంధం.. డబ్బు వివాదమే కారణం 
ఆంజనేయరెడ్డి కొంతకాలం రైల్వేపోలీస్‌ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో మరో మహిళతో చనువుగా ఉంటున్నావని లక్ష్మీవినీల తరచూ భర్తతో గొడవపడేది. రిటైర్‌మెంట్‌ అనంతరం వచ్చిన డబ్బులను బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. రూ.లక్షా ముప్పై వేల విషయంలో ఆంజనేయరెడ్డి చెప్పిన లెక్కలకు లక్ష్మీవినీల సంతృప్తి చెందలేదు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఆ డబ్బు ఇచ్చావని కొద్దిరోజులుగా గొడవ పడుతోంది. సోమవారం రాత్రి ఈ విషయమై మళ్లీ గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఛాతీ కింద భాగంలో 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

భర్త దాడి చేసే సమయంలో వినీల పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏపీకి అప్పుడప్పుడు విమానంలో వెళ్లేవాడినని, ఈ క్రమంలో డబ్బు ఖర్చు అయిం దని చెప్పినా నమ్మకుండా మరో మహిళతో సం బంధముందని వేధించడంతోనే హత్య చేసినట్లు ఆంజనేయరెడ్డి పోలీసులకు తెలిపాడు. కొండాపూర్‌లో ఉండే కూతురు రామప్రవళిక, అల్లుడు హుటాహుటిన వచ్చి కన్నీళ్ల పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు