ఎయిర్‌పోర్టులో భారీ చోరీ.. పోలీసులు షాక్!

14 Dec, 2017 11:36 IST|Sakshi

పారిస్: ఎయిర్‌పోర్టులో 3 లక్షల యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.25 కోట్లు) డబ్బున్న రెండు సంచులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటన ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ప్రధాన విమానాశ్రమంలో చోటుచేసుకుంది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈ చోరీతో ఇంకా షాక్‌లోనే ఉన్నారు. దాదాపు యాభై ఏళ్లున్న ఓ వ్యక్తి పారిస్ లోని చార్లెస్ డి గాల్లే ఎయిర్‌పోర్టుకు గత శుక్రవారం వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టులో అటూఇటూ తిరుగుతున్న ఆ గుర్తుతెలియని వ్యక్తి లూమిస్ క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీ గదుల వద్దకు వెళ్లగా.. రూమ్ ఓపెన్ చేసి ఉన్నట్లు గమనించాడు. క్షణాల్లో ఆ గదిలోకి వెళ్లిన ఆ వ్యక్తి కంపెనీ అక్కడ ఉంచిన రెండు సంచుల డబ్బును గుర్తించి.. చాకచక్యంగా వాటితో పరారయ్యాడు.

లే పారిసియన్ అనే స్థానిక పత్రికలో పర్ఫెక్ట్ క్రైమ్ అంటూ కథనం రావడంతో విషయం వెలుగుచూసింది. ఆ సయంలో కంపెనీ రూము ఎందుకు తెరిచారో తెలియదు కానీ, ఆగంతకుడు మాత్రం ఎంతో అదృష్టవంతుడు.. అతడు రెండు వారాల ముందే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడంటూ ఆ కథనం సారాంశం. భారీ చోరీ ఎలా జరిగింది, లూమిస్ కంపెనీ సిబ్బంది హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ పారిస్ పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించినా నిందితుడి ఆచూకీ తెలియట్లేదని సమాచారం. యాభై ఏళ్ల వ్యక్తి ఎయిర్‌పోర్టులో సులువుగా 3 లక్షల యూరోలు కొట్టేశాడంటే పోలీసులకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదట.

మరిన్ని వార్తలు