రోడ్డుపై వెంటాడి.. వేటాడి

14 Feb, 2019 16:48 IST|Sakshi

వేలూరు: పట్టణ సమీపంలోని మేల్‌ విషారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వేలూరు రౌడీని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన çకలకలం రేపింది. వేలూరు సైదాపేట కన్నిఆలయం వీధికి చెందిన మదిఅయగన్‌ కుమారుడు తమిళరశన్‌(26). మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇతను రాత్రి పూర్తిగా ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మేల్‌విషారంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఉన్న సర్వీస్‌ రోడ్డులో రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన డీఎస్పీ సెల్వం, రత్నగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరపగా తమిళరశన్‌ చేతులు, కాళ్లు, గొంతు వద్ద కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. రోడ్డుపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా వెంటాడి చంపినట్లు ప్రాథమిక విచారణలో తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తమిళరశన్‌ తన అనుచరులతో కలిసి గత కొద్ది నెలల క్రితం వేలూరు కాట్టుకార వీధికి చెందిన ప్రభాకరన్‌ తలపై బండరాయిని వేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రభాకరన్‌ అనుచరులు ఎవరైనా తమిళరశన్‌ను హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తమిళరశన్‌పై ఇది వరకే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు