స్నేహితుడని నమ్మి వెళ్లిన యువతిపై..

28 Dec, 2018 09:06 IST|Sakshi
నిందితుడు హయాన్‌

కృష్ణరాజపురం: స్నేహితుడని నమ్మి వెళితే ఓ నీచుడు యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అశోకనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. అసోం రాష్ట్రానికి చెందిన హయాన్‌ డైమెరి కొద్ది కాలంగా బెంగళూరు నగరంలోని రిచ్‌మండ్‌ రోడ్‌లో ఉన్న స్టార్‌ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ముంబయి నగరంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని ఆరు నెలల క్రితం నిందితుడు పని చేస్తున్న హోటల్‌లో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వచ్చారు. ఒకే హోటల్‌లో పని చేస్తుండడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం నిందితుడు హయాన్‌ నగరంలోని ఆస్టిన్‌టౌన్‌లో ఉన్న తన గదిలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు.

పార్టీకి బాధితురాలిని కూడా ఆహ్వానించడంతో నిందితుడిపై నమ్మకంతో బాధితురాలు పార్టీకి వెళ్లారు. పార్టీ అర్ధరాత్రి వరకు కొనసాగడంతో ఈ సమయంలో వెళ్లడం ఉత్తమం కాదని ఉదయాన్నే వెళ్లాలంటూ సూచించడంతో బాధితురాలు అక్కడే ఉండిపోయారు. కొద్ది సేపటి అనంతరం బాధితురాలు నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డ నిందితుడు హయాన్‌ యువతికి బలవంతంగా మద్యం తాగించి అటుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో కొద్ది రోజులు మిన్నకుండిపోయిన బాధితురులు గురువారం స్నేహితుల సహకారంతో అశోకనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హయాన్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు