మూడో పెళ్లి చేయలేదని తల్లిని కడతేర్చాడు

25 Jan, 2018 08:23 IST|Sakshi

సాక్షి, చెన్నై: తనకు పెళ్లి చేయడం లేదన్న ఆగ్రహంతో కన్న తల్లిని ఓ యువకుడు గొంతు కోసి కడతేర్చాడు. వివరాలు.. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన వేణు(80), లక్ష్మి(75) దంపతులకు కుమార్‌(30), మురుగన్‌(28) ఇద్దరు కుమారులు. కుమార్‌కు వివాహమైంది. మురుగన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. గంజాయికి అలవాటు పడి వేధిస్తుండడంతో అతడితో కాపురం చేయలేక ఆ ఇద్దరు భార్యలు వదలి వెళ్లారు. ప్రస్తుతం తనకు మూడో పెళ్లి చేయాలని మురుగన్‌ తల్లిదండ్రుల్ని వేధించడం మొదలుపెట్టాడు.

ఇలాఉండగా ఈ నెల 19న మురుగన్‌ తండ్రి వేణు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి తల్లి లక్ష్మితో గొడవపడ్డ మురుగన్,  కత్తితో ఆమె గొంతు కోసి ఉడాయించాడు. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో తండ్రి వేణును గొంతు నులిమి మురుగన్‌ హత్య చేసినట్టు తేలిసింది. అజ్ఞాతంలో ఉన్న ఈ ఉన్మాదిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

మరిన్ని వార్తలు