ప్లీజ్‌... ఆ కిరాతకుడి నుంచి కాపాడండి!

5 Feb, 2018 09:18 IST|Sakshi
మహిళ పోస్టు చేసిన వీడియోలోని దృశ్యాలు

సాక్షి, ముంబై : తన భర్త పెట్టే హింసను పూస గుచ్చినట్లు వివరిస్తూ ఓ మహిళ సాయం కోరిన వీడియో వైరల్‌ అవుతోంది. వ్యాపారవేత్త అయిన తన భర్త.. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ మహిళ వీడియోలో వేడుకోవటం ఉంది. తన సందేశాన్ని ఆమె తన సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అశోక్‌ పండిట్‌ తన ట్విటర్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు. 

‘‘నా భర్త నన్ను హింసిస్తున్నాడు. ఇది ఈ నాటిది కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతోంది. అతనో అమ్మాయిల పిచ్చోడు. జూదగాడు.. అప్పుల పాలయ్యాడు. పైగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ అవలక్షణాల మూలంగానే నేను నా కూతురితో ఆయనకు దూరంగా ఉంటున్నాం. అయినా డబ్బు కోసం నన్ను వేధిస్తూ వస్తున్నాడు. నా పేరు మీద ఉన్న ఒక్క ఫ్లాట్‌ను తన పేరు మీద రాయాలంటూ వేధిస్తున్నాడు. పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. పైగా ఆ స్టేషన్‌ ఎస్సై నా భర్తతో కుమ్మక్కయ్యాడు. నాకు ప్రాణ హని ఉంది. దయచేసి ఎవరైనా సాయం చెయ్యండి. ఈ కిరాతకుడిని నుంచి నన్ను, నా కూతురిని కాపాడండి’’ అంటూ ఆ మహిళ దీనంగా వేడుకున్నారు.

ముంబై కమిషనరేట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే వ్యాపారవేత్త తన భార్య, ముగ్గురు పిల్లలతో ఖర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య, భర్తలిద్దరికీ మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో గొడవలు జరిగి అదే అపార్ట్‌మెంట్‌లో వేర్వేరు ఫ్లాట్‌లలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఓరోజు భార్య ఉంటున్న ఫ్లాట్‌లో దొంగతనానికి యత్నించిన గుర్‌ప్రీత్‌, మరోసారి ఏకంగా ఆమెపై దాడికి యత్నించాడు. ఈ రెండు ఘటనలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదయినా పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను మరోసారి ఆమెపై దాడికి తెగబడటంతో ప్రాణ భయంతో ఆమె వీడియోను పోస్టు చేసి సాయం కోరారు.

మరిన్ని వార్తలు