క్వారీ పేలుడు ఘటన : ఇద్దరి పరిస్థితి విషమం

4 Aug, 2018 10:18 IST|Sakshi

కర్నూలు/ అమరావతి : ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాజేంద్ర(40) 90 శాతం కాలిన గాయాలు, రామచంద్ర(45) 50 శాతం గాయాలు, పాండు(40) 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. రాజేంద్ర, పాండుల పరిస్థితి విషమంగా ఉందని కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెబుతున్నారు.  దిలీప్‌(22), వికాస్‌(19)లకు ప్రమాదమేమీ లేదని, చిన్నపాటి కాలిన గాయాలు అయ్యాయని తెలిపారు. 

సీఎం దిగ్ర్బాంతి
అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. డీజీపీ, హోంమంత్రులను సంఘటనాస్థలానికి తరలివెళ్లాలని ఆదేశించారు. గాయపడిన వారికి అత్యున్నత స్థాయి వైద్యం అందించాలని చెప్పారు.నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ యజమానులపై కఠిన చర్యలు చేపట్టాలని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్‌ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు