ఊపిరుండగానే ఉసురు తీద్దామనుకుని..

1 Nov, 2019 02:45 IST|Sakshi

చిన్నారిని పూడ్చేందుకు ప్రయత్నం 

కుటుంబీకుల అనుమానాస్పద కదలికలు గుర్తించిన ఆటోడ్రైవర్‌ 

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆగిన అమానుషం

ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న మారేడ్‌పల్లి పోలీసులు 

ఇన్ఫెక్షన్‌తో ఉన్న చిన్నారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స 

మారేడ్‌పల్లి : అమ్మ పొత్తిళ్లలో ఒదిగిపోవాల్సిన నవజాత శిశువు బంధు రక్కసి చేతుల్లోచిక్కుకుని మరణపు అంచుల వరకు వెళ్లింది. వైకల్యంతో కనులు తెరిచిన ఆ పసిగుడ్డును అమ్మకు దూరం చేసి కనుమూయించాలనుకున్నారు..ఊపిరుండగానే ఉసురు తీద్దామనుకున్నారు బంధువులు. లింగమేమిటో తెలియని ఆ శిశువు భారం దించుకుని, ఆ బంధాన్ని తెంచుకోవాలని ఏకంగా సజీవ సమాధి చేసేందుకు సిద్ధమైపోయారు. అమ్మతనాన్ని బిడ్డకు, పేగు బంధాన్ని అమ్మకు దూరం చేయాలనుకుని మానవత్వాన్ని మంటగలిపి మనుషులుగా దిగజారిపోయారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు అని అందుకే అన్నాడేమో ఓ కవి. బంధువుల కదలికలపై ఓ ఆటో డ్రైవర్‌కు అనుమానమొచ్చి పోలీసులకు సమాచారమివ్వడంతో వీరి అమానవీయ కథ వెలుగుచూసింది. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.  

జన్యు సమస్యలతో జన్మించిన శిశువు 
కరీంనగర్‌ జిల్లా వేములవాడ సమీపంలోని సంకెపల్లి గ్రామానికి చెందిన మానస, రాజు భార్యాభర్తలు. మానస సోమవారం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. మర్మాంగాల వద్ద జన్యు సమస్యతో పుట్టిన ఆ పసికందు లింగనిర్ధారణ తేలలేదు. మూత్ర విసర్జనకు ఆస్కారం లేకపోవడంతో వైద్యులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళాలని, అక్కడి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని కరీంనగర్‌ప్రభుత్వాస్పత్రి వైద్యులు సూచించారు. దీంతో శిశువు తండ్రి రాజు, తాత తిరుపతి, నాయనమ్మ తిరుపతమ్మలు అదేరోజు సాయంత్రం శిశువును నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన నీలోఫర్‌ వైద్యులు శిశువుకు సాధారణ మూత్ర విసర్జన అయ్యేలా చేయడానికి ఆపరేషన్‌ అవసరమని, శస్త్రచికిత్స చేసినప్పటికీ బతికే అవకాశాలు తక్కువని చెప్పారు. దీంతో పసికందు తండ్రి రాజు కరీంనగర్‌కు వెళ్ళిపోయి బాబాయి రాజేందర్‌ను హైదరాబాద్‌కు రప్పించాడు. రాజేందర్‌తో పాటు చిన్నారి తాత, నాయనమ్మలు ఆస్పత్రిలో శిశువు వద్ద ఉన్నారు. వీళ్ళు కరీంనగర్‌ తీసుకువెళ్ళి శిశువుకు వైద్యం చేయిస్తామని నీలోఫర్‌ వైద్యులతో చెప్పారు. దీంతోవారు శిశువును గురువారం ఉదయం డిశ్చార్జ్‌ చేసి కుటుంబీకులకు అప్పగించారు. దీంతో ఈ ముగ్గురూ శిశువును తీసుకుని అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి 9 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పసిబిడ్డలను పెట్టే చిన్న పరుపును సంచిలా మలిచి అందులో శిశువును పెట్టుకుని రాజేందర్, తిరుపతి జేబీఎస్‌ పక్కన ఉన్న కంటోన్మెంట్‌ మైదానంలోకి వెళ్లగా తిరుపతమ్మ మాత్రం బస్టాండ్‌లోనే ఉండిపోయింది.  

పికెట్‌ మైదానంలో పసికందునుపూడ్చేందుకు తవి్వన గొయ్యి  

ఆటోడ్రైవర్‌ అనుమానంతో... 
కంటోన్మెంట్‌ మైదానంలో రాజేందర్, తిరుపతి గొయ్యి తవ్వుతుండగా అక్కడే సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్‌కు వీరి కదలికలపై అనుమానమొచ్చింది. వెంటనే జేబీఎస్‌ వద్ద విధుల్లో ఉన్న మారేడ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుళ్లు ఎస్‌.వెంకట రామకృష్ణ, ఆంజనేయులు, చెన్నయ్యలకు చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. సంచిలో శిశువును గమనించిన పోలీసులు శ్వాస ఆడటంతోపాటు కదలికల్ని గుర్తించారు. వెంటనే శిశువును గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై వారిని ప్రశ్నించగా శిశువు చనిపోయిందని భావించామని, మృతదేహాన్ని తీసుకుని బస్సులో వెళ్ళనీయరని, తమకు ప్రత్యేక వాహనంలో వెళ్ళే స్థోమత లేక పూడ్చిపెట్టడానికి ప్రయత్నించామని పోలీసులకు చెప్పారు. బస్టాండ్‌లో ఉండిపోయిన తిరుపతమ్మతో సహా వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళి విచారించారు.

పోలీస్‌ స్టేషన్లో మరో కథనం  
వీరిని పోలీసుస్టేషన్‌లో విచారించిన నేపథ్యంలో రాజేందర్, తిరుపతి, తిరుపతమ్మలు మరో కథనం చెప్పారు. శిశువు మరణిం చిందని భావించామని, తల్లి మానస ఆరోగ్య పరి స్థితి విషమంగా ఉండటంతో ఈ విషయం తెలిస్తే ప్రమాదమంటూ తండ్రి రాజు చెప్ప డంతోనే పూడ్చిపెట్టడానికి ప్రయత్నించామని చెప్పారు. జన్యు సమస్యతో పుట్టిన శిశువు ను ఉద్దేశపూర్వకంగా చంపేయడానికి ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు తండ్రి చెప్పడంతోనే వీరు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. మరోపక్క శిశువు కు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ పసికందు ప్రస్తుతం పలు రకాల ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆస్పత్రి చిన్నపిల్లల విభాగం నియోనెటాల్‌ ఇన్సెంటివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయు)లోని ఇంక్యూబేటర్‌ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు.   
 
మెరుగైన వైద్యం అందిస్తున్నాం 
‘చిన్నారి శిశువు మర్మావయవం స్థానంలో ఓ గడ్డ ఉంది. శరీరంలో అంతర్గతంగా ఉండాల్సిన యూరినరీ బ్లాడర్‌ బయటే ఉంది. ఇలా మర్మావయవాలు పూర్తిగా పెరగక పోవడాన్ని వైద్యపరిభాషలో ‘యాబీగసీ జెనటాలియా’అంటారు. వేల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్య వస్తుంది. దీంతో ప్రస్తుతం ఆ శిశువు ఆడ, మగా అనేది నిర్ధారణ చేయలేకపోతున్నాం. ఇన్‌ఫెక్షన్స్‌ తగ్గిన తర్వాత శస్త్రచికిత్స నిర్వహిస్తాం. శిశువును పోలీసులు ఆస్పత్రికి తరలించడంతో మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ)గా పరిగణించాం. వైద్యసేవల అనంతరం శిశువు కొంత మేర కోలుకుంది. 
– యశోద, డ్యూటీ ఆర్‌ఎంఓ, గాంధీ ఆస్పత్రి  

మరిన్ని వార్తలు