పిల్లాడిని చంపి నెలరోజులు సూట్‌కేసులోనే..

14 Feb, 2018 12:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏడు సంవత్సరాల బాలుడిని చంపి... నెల రోజుల పాటు సూట్‌కేసులోనే దాచిన ఘటన నార్త్‌వెస్ట్‌ ఢిల్లీలోని స్వరూప్‌ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అవదేశ్‌ శాక్య(27) అనే యువకుడు తాను అద్దెకున్న ఇంట్లోని ఆశీస్‌(7) అనే బాలుడిని జనవరి 6న హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నెలరోజుల పాటు సూట్‌కేసులోనే దాచి పెట్టాడు. తన కొడుకు కనిపించడం లేదని ఆశీష్‌ తండ్రి కరణ్‌ సింగ్‌ స్వరూప్‌నగర్‌  పోలీసుస్టేషన్‌లో జనవరి 6న ఫిర్యాదు దాఖలు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు, ఇంట్లో అద్దెకున్న అవదేశే ఈ హత్య చేసినట్టు తేల్చారు. ఆశీష్‌ తల్లిదండ్రులు అవదేశ్‌తో మాట్లాడవద్దని చెప్పేవారని, దానితో వారిపై కసితో అవదేశ్‌ ఈ అకృత్యానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. అవదేశ్‌ను అతని ఇంట్లోనే అరెస్ట్‌ చేసినట్టు నార్త్‌వెస్ట్‌ డీసీపీ అస్లమ్‌ ఖాన్‌ చెప్పారు. బాలుడి మృతదేహాన్ని ఎక్కడైనా పారేసి, డబ్బు కోసం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేయాలనుకుంటున్నట్టు అవదేశ్‌ పోలీసుల ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. 

మూడు సంవత్సరాలు కరణ్‌ ఇంట్లో అద్దెకు...
అవదేశ్‌ యూపీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడని పోలీసులు చెప్పారు. అతను మూడు సంవత్సరాలుగా కరణ్‌ సింగ్‌ ఇంట్లో అద్దెకు ఉన్నాడని, ఈ మూడు సంవత్సరాల కాలంలో కరణ్‌ సింగ్‌, అతని కుటుంబసభ్యులకు అవదేశ్‌ సన్నిహితుడయ్యాడని తెలిపారు. కొన్ని నెలల కిందట అవదేశ్‌ ఇల్లు ఖాళీ చేసి అదే ప్రాంతంలో ఉన్న మరో ఇంటికి మారాడని వారు చెప్పారు. ఇల్లు మారిన తర్వాత కూడా కరణ్‌ సింగ్‌ ఇంటికి అవదేశ్‌ వచ్చి పోతుండేవాడు. అయితే కరణ్‌ సింగ్‌ తన కొడుకును అవదేశ్‌తో కలవనిచ్చేవాడు కాదని పోలీసు అధికారి చెప్పారు. జనవరి 6న అశీష్‌, అవదేశ్ ఇంటికి వచ్చి తన తండ్రి అతనితో మాట్లాడవద్దని చెప్పాడని తెలిపాడు. దీంతో అవదేశ్‌ ఒళ్లు తెలియని ఆగ్రహంతో ఆశీష్‌ను మప్లర్‌తో చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో దాచిపెట్టాడు.

ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల పక్కనే...
ఆశీష్‌ను చంపిన తరువాత కూడా అవదేశ్‌ ఏమీ తెలియని వాడిలా కరణ్‌ సింగ్‌ ఇంటికి రాకపోకలు సాగించాడు. తన కొడుకు కనిపించకుండా పో​యాడని కరణ్‌ సింగ్‌ పోలీసుకలకు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు కూడా అతని వెంట అవదేశ్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా.. దాని గురించి అడిగిన పొరుగు వారికి ఇంట్లో ఎలుకలు చ్చాయని అతను బుకాయించాడు. ఆశీష్‌ కోసం గాలిస్తూ పోలీసులు ఆ ప్రాంతలో నిరంతరం తచ్చాడుతుండటంతో తాను మృతదేహాన్ని మరో చోటికి తీసుకెళ్లి పారేయలేకపోయాయని అవదేశ్‌ అంగీకరించాడు. అవదేశ్‌ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని, అతను సివిల్‌ సర్వీసు పరీక్షలు రాస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతను మూడు సార్లు ప్రిలిమినరీ, రెండు సార్లు మెయిన్స్‌ పరీక్షలు రాశాడని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు