అన్నానగర్: ముత్తుపేట సమీపంలో గురువారం భర్త మృతి చెందిన దిగ్భ్రాంతితో భార్య మృతి చెందింది. దంపతుల మృతదేహాలను ఒకే స్థలంలో దహనం చేశారు. తిరువారూర్ జిల్లా ముత్తుపేట సమీపం ఆలంగాడు అమరక్కన్ని వీధికి చెందిన సుబ్రమణ్యన్ (74). ఇతను ముత్తుపేట కార్పొరేషన్ కార్యాలయంలో సహాయకుడిగా పని చేసి పదవీ విరమణ పొందాడు. ఇతని భార్య రాజేశ్వరి (65). వీరికి కృష్ణమూర్తి, నారాయణస్వామి, చంద్రశేఖరన్ అనే కుమారులు. చంద్ర, పునీత అనే కుమార్తెలు ఉన్నారు. వీరందరికీ వివాహం జరిగింది. వీరందరూ తమ కుటుంబీకులతో నివశిస్తున్నారు. సుబ్రమణ్యన్–రాజేశ్వరి ఒంటరిగా ఉంటూవచ్చారు.
వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ఉన్న సుబ్రమణ్యన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి దిగ్భ్రాంతి చెంది సృహ తప్పింది. వెంటనే ఆమెను బంధువులు చికిత్స కోసం ముత్తుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. భార్యభర్తలు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మతదేహాలను అక్కడ ఉన్న శ్మశానంలో ఒకేచోట దహనం చేశారు.