పాముతో మహిళ నాట్యం

23 Dec, 2019 07:45 IST|Sakshi
పాముతో కపిల

వీడియో వైరల్‌ మహిళ అరెస్టు

చెన్నై, టీ.నగర్‌ : ఆలయ ప్రసిద్ధి కోసం పాముతో నాట్యం చేసి వీడియోను వైరల్‌ చేసిన మహిళను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వాలాజాబాద్‌ అవెల్లేరి అమ్మ ఆలయ వీధికి చెందిన మహిళ కపిల (39) అదే ప్రాంతంలో వనభద్రకాళి అమ్మన్‌ ఆలయాన్ని నిర్వహిస్తూ భక్తులకు జోస్యం చెబుతూ వస్తున్నారు. ఒకటిన్నర ఏడాది క్రితం జరిగిన ఆలయ కుంభాభిషేకం సమయంలో ఒక పామును అమ్మవారి మెడలో ఉంచి, ఆ తర్వాత తన దేహంపై వేసుకుని నాట్యం చేస్తూ పాలాభిషేకం చేశారు.

ఆ తర్వాత కపిల తమ ఆలయం ప్రసిద్ధి చెందడంతో భక్తుల రాక అధికమైంది. ఇలా ఉండగా పాముతో నాట్యం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యం చెందారు. ఈ వీడియో చూసిన చెంగల్పట్టు  జిల్లా అటవీశాఖ అధికారి పాండురంగన్‌ ఆధ్వర్యంలో ఒక బృందం శనివారం సాయంత్రం వాలాజాబాద్‌కు వచ్చి విచారణ జరిపారు. ఆ పామును ఎక్కడి నుంచి తీసుకువచ్చారని, ఎక్కడ దాచారని ప్రశ్నించారు. అందుకు కపిల సరైన సమాధానం ఇవ్వలేదు. వన్యప్రాణుల నిరోధక చట్టం కింద కపిలను అరెస్టు చేశారు. తర్వాత ఆమెను కాంచీపురం కోర్టులో హాజరుపరిచి జైల్లో నిర్బంధించారు.

మరిన్ని వార్తలు