తండ్రిని చావబాది.. రోడ్డుపై పడేసింది

6 Feb, 2020 09:33 IST|Sakshi

జైపూర్‌: తండ్రి తాగుబోతుగా మారాడని కసాయిగా మారిందో కూతురు. పనికి వెళ్లకుండా నిత్యం తాగుతూ ఇంటికి వస్తున్నాడని ఆగ్రహించి అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. విజ్ఞాన్‌ నగర్‌లో అజ్మర్‌కు చెందిన అశోక్‌ కుమార్‌ ఓ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్యాకొడుకు గతంలోనే చనిపోగా యామిని, రాగిని అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు కాగా రాగినికి 10 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అశోక్‌ ప్రస్తుతం రాగినితో కలిసి నివాసం ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన అశోక్‌ కొద్ది రోజులుగా పనికి వెళ్లడం మానేసి, ప్రతిదినం తాగుతూ ఇంటికి వస్తున్నాడు.

దీంతో తండ్రి తీరుకు విసుగు చెందిన రాగిని ఏకంగా అతన్ని చంపేందుకే సిద్ధపడింది. ఈ క్రమంలో తండ్రిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టి అతన్ని చావబాదింది. అనంతరం గాయాలతో తీవ్ర రక్తస్రావమవుతున్న అతని శరీరాన్ని ఇంటి బయటకు లాక్కెళ్లి రోడ్డుపై పడేసింది. అతని శరీరంపై నీళ్లు గుమ్మరించి ఎముకలు కొరికే చలిలోనే చావమంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి తనకు అంటిన రక్తాన్ని కడిగేసుకుంది. ఇక ఈ విషయాన్నంతటినీ సోదరి యామినికి వివరించి చెప్పగా ఆమె ఇంటికి చేరుకునేసరికి తండ్రి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాగినిని అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు.

చదవండి: నేను ప్రేమించడం లేదు.. చస్తే చావు

మరిన్ని వార్తలు