వివాహితపై ఐదు రోజులపాటు అఘాయిత్యం

24 Jan, 2020 16:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : వివాహితను గదిలో బంధించి అయిదురోజుల పాటు అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. నెల 19న జరిగిన ఈ ఘటన గురించి శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు. బడోహి జిల్లాలోని నివసిస్తున్న ఓ మహిళకు(18) మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. అయిదు రోజుల క్రితం మహిళ తన అత్తగారి ఇంట్లో ఉందని తెలుసుకున్న ఓ వ్యక్తి అక్కడకి వచ్చి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు. ఆనంతరం ఆమెను గదిలో బంధించి బలవంతంగా అయిదు రోజులు అత్యాచారానికి తెగబడ్డాడు. బుధవారం కోడలి తల్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకోడానికి అత్తమామలు మహిళ పుట్టింటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది.

తన కూతురు అసలు ఇంటికి రాలేదని తల్లి చెప్పడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని విశాల్‌ సరోజ్‌గా గుర్తించారు. సరోజ్‌ బాధితురాలి గ్రామానికే చెందినవాడని పోలీసులు తెలిపారు. గురువారం సరోజ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రం మధ్యలోని గదిలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సరోజ్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు