హోమ్‌గార్డు దారుణ హత్య

30 Jul, 2018 08:25 IST|Sakshi
కాలిపోయిన షబ్బీర్‌ మృతదేహం, షబ్బీర్‌ (ఫైల్‌)

సాక్షి, కొనకనమిట్ల : వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడిని నమ్మించి మంచానికి కట్టేసి ప్రియురాలు కిరోసిన్‌ పోసి హత్య చేసిన ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన షేక్‌ షబ్బీర్‌ (32) మర్రిపూడి పోలీసుస్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా విధులకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో షబ్బీర్‌కు పొదిలి పట్టణానికి చెందిన షకీరా అలియాస్‌ ఇమాంబీతో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి కొనకనమిట్ల మండలం చవటపల్లి, పేరారెడ్డిపల్లిలో ఉన్న కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు.

ఇటీవల ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. శనివారం రాత్రి చవటపల్లిలోని కోళ్లఫారంలో షబ్బీర్, షకీరాలు ఉన్నారు. ఏం జరిగిందో ఏమోగానీ కోళ్లఫారం నుంచి మంటలు వస్తుండటంతో స్థానికులు వెళ్లి మంటలు ఎందుకు వస్తున్నాయని షకీరాను ప్రశ్నించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వచ్చాయని సమాధానం చెప్పింది. నమ్మని కోళ్లఫారం యజమాని లోపలికి వెళ్లి చూడగా షబ్బీర్‌ కాలిపోయి మృతదేహమై కనిపించాడు. మృతదేహం ఉన్న తీరు చూస్తే కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపినట్లు ఉంది. కాళ్లూ చేతులను గొలుసులతో మంచానికి కట్టేసి తాళాలు కూడా వేసి ఉన్నాయి.

సమాచారం తెలుసుకున్న పొదిలి సీఐ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ అబ్దుల్‌ రహమాన్‌ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక లావాదేవీలే షబ్బీర్‌ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు