మహిళ ఆత్మహత్యాయత్నం

10 Jul, 2018 12:15 IST|Sakshi
మంజుల నుంచి పెట్రోల్‌ బాటిల్‌ను లాక్కుంటున్న కానిస్టేబుల్‌

వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఘటన..

నిలువరించిన పోలీసులు

జడ్చర్ల : తనపై అత్యాచారం జరపడమే గాక పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఓ మహిళ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.

బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని గంగాపూర్‌ గ్రామానికి చెందిన మంజుల ఇంట్లోకి ఆమె భర్త లేని సమయంలో విద్యుత్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వరిస్తున్న బత్తుల కృష్ణయ్య గతేడాది సెప్టెంబర్‌ 10న రాత్రి ప్రవేశించి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని భర్తకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపెద్దలు కృష్ణయ్యను పిలిచి విచారించగా తప్పును మన్నించాలని, ఇక నుంచి వారి జోలికి వెళ్లనని చెప్పి తిమ్మాజిపేట మండలానికి బదిలీ చేయించుకున్నారు.

అనంతరం ఇటీవల మంజుల భర్త రూ.9 లక్షలు తనకు అప్పు ఉన్నాడని పేర్కొంటూ కృష్ణయ్య వనపర్తి కోర్టు నుంచి నోటీసులు పంపాడు. అలాగే, మంజులను తనతో పంపాలని, లేకుంటే ఆమె భర్తను చంపేస్తానంటూ బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించింది.

ముందుగా ఈ నెల 2న ఎస్పీ అనురాధ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆమె జడ్చర్ల పోలీసులను సంప్రదించాలని సూచించింది. అయితే ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతుండగా.. తనకు అనుమానం ఉందని చెబుతూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసినట్లు మంజుల వివరించింది. 

కేసు నమోదు.. 

సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లోకి తన తండ్రితో కలిసి వచ్చిన మంజుల ముందుగా ఎస్‌ ఐ వెంకటనారాయణ, తర్వాత సీఐ బాలరాజుయాదవ్‌ను కలిసి సమస్యను వివరించింది. అనంతరం అకస్మాత్తుగా స్టేషన్‌ ఆవరణలో బైఠాయించి కవర్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ బాటిల్‌ తీసి ఒంటిపై పోసుకుంది.

గమనించిన పోలీసు లు వెంటనే పెట్రోల్‌ బాటిల్‌ లాక్కున్నారు. దీం తో సీఐ తన చాంబర్‌లోకి పిలిపించి విచారించారు. తాము ఎవరి పక్షాన పనిచేయడం లేదని, ఎ లాంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా లేవన్నారు.

సం ఘటన గతేడాది సెప్టెంబర్‌లో జరగడంతో సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్పీ సూచన మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు