నన్ను కాదని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే

24 Mar, 2018 07:58 IST|Sakshi

యువతిపై వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై కేసు

బంజారాహిల్స్‌: నన్ను కాదని ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నావో నాతో కలిసి దిగిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని ఇన్‌కం ట్యాక్స్‌ క్వార్టర్స్‌ సమీపంలో నివసించే యువతి(25) ఈవెంట్స్‌ మేనేజర్‌గా పని చేస్తోంది. ఇటీవల ఆమెకు ఫేస్‌బుక్‌లో సౌదీలో ఉంటున్న రియాద్‌ బిన్‌ ఖాలిద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ కుదరడంతో గత ఏడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు.

అయితే గత కొద్ది రోజులుగా రియాద్‌లో తీవ్ర మార్పు వచ్చింది. ఆమె గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌ను తన వద్దే ఉంచుకొని ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో రియాద్‌ నుంచి విడిపోయిన ఆమె తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే రియాద్‌ ఆమె తల్లికి ఫోన్‌ చేసి తనను కాదని వేరొకరికి ఇచ్చిన పెళ్లి చేస్తే బతకనివ్వనని తనతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు తన వద్ద ఉన్నాయని వాటిని విడుదల చేస్తానంటూ హెచ్చరించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రియాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు