సాక్షి, సంగారెడ్డి: మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బుధవారం జిల్లాలపై ఏర్పాటు చేసిన సబ్కమిటీ, ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన సీఎం కేసీఆర్ గురువారం అధికారులతో జిల్లాల విభజనపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల విభజనలో భాగంగా మెదక్ను మూడు జిల్లాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
సంగారెడ్డి జిల్లా: 4,480.57 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సంగారెడ్డి జిల్లా ఏర్పాటు కానుంది. ఈ జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉంటాయి. ఈ జిల్లాలో 15,49,277 జనాభా ఉంటారు. అలాగే రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సంగారెడ్డికి అదనంగా జహీరాబాద్లో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సిద్దిపేట జిల్లా: 18 మండలాలతో ఈ జిల్లా అవతరించనుంది. 3856.62 చదరపు కిలోమీటర్ల చదరపు విస్తీర్ణం కలిగి ఉండనుంది. ఈ జిల్లా పరిధిలోకి 10,65,127 మేర జనాభా వస్తారు.
మెదక్ జిల్లా: ఈ జిల్లా పరిధిలోకి 14 మండలాలు వస్తాయి. 2696.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు కానుంది. ఈ జిల్లా జనాభా 47,357.
‘మెదక్’ మండలాల పెంపు
త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రస్థాయిలో నిర్వహించే అఖిలపక్షం సమావేశంలో ప్రతిపాదిత మెదక్ జిల్లాలో మండలాల సంఖ్యపై చర్చ జరిగే అవకాశం ఉంది. మండలాల సంఖ్య పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన పక్షంలో మరికొన్ని చేర్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో సైతం జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు వెలువడే అవకాశాలున్నాయి. దీనిని అనుసరించి ప్రతిపాదిన కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన మండలాల విలీనం, విభజనలో స్వల్ప తేడాలు ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం