కౌన్సిలర్‌ దంపతులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల వీరంగం

27 Sep, 2016 23:15 IST|Sakshi
పగిలిన అద్దాల వద్ద కౌన్సిలర్‌ రుక్కుంబాయి దంపతులు
  • కత్తులతో బెదిరించిన యూత్‌ విభాగం
  • ఫర్నిచర్, కంప్యూటర్‌ ధ్వంసం
  • పార్టీకి రాజీనామా చేయకుంటే చంపుతామని బెదిరింపు
  • సిరిసిల్ల టౌన్‌ : సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్‌ దంపతులపై టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం కార్యకర్తలు తెగబడ్డారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ బూట్ల రుక్కుంబాయి ఇంటిపై దాడిచేసి.. కౌన్సిలర్‌ భర్తను దూషించారు. ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. 27వ వార్డు కౌన్సిలర్‌ బూట్ల రుక్కుంబాయి భర్త సుదర్శన్‌ వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో ప్రజల ఆకాంక్ష కోసం పద్మశాలి అనుబంధ సంఘాల జేఏసీ చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నాడు. పద్మశాలి నేతలు ప్రతిరోజూ అంబేద్కర్‌ చౌరస్తాలో రిలేదీక్షలు చేపడుతున్నారు. మంగళవారం సిరిసిల్లకు వచ్చిన మాజీ ఎంపీ పొన్నం, టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వచ్చి దీక్షకు మద్దతు పలికారు. రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు సుదర్శన్‌ ఆయన వాహనంపైకి చేరి జిల్లా ఆకాంక్షను వెలిబుచ్చారు. దీంతో రెచ్చిపోయిన టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం అధ్యక్షుడు సుంకపాక మనోజ్, మహమూద్, బాబి, వేముల గంగాధర్‌ మరో 20 మంది కౌన్సిలర్‌ ఇంటికి చేరుకుని దాడిచేశారు. పార్టీకి రాజీనామా చేయాలంటూ కత్తులతో బెదిరిస్తూ.. ఇంట్లోని అద్దాలు, కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు. మంత్రి కేటీఆర్‌కే వ్యతిరేకంగా పనిచేస్తావా..? చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. 
    మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించాలి
    తమపై జరిగిన దాడికి మంత్రి కేటీఆర్‌ బాధ్యత వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్‌ దంపతులు కోరారు. పద్మశాలి కులస్తుల ఆకాంక్ష మేరకు తాను జిల్లా కావాలని కోరుతున్నామని, మంత్రికి, పార్టీకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. దాడికి పాల్పడిన వారితో తమకు ప్రాణహాని ఉందని, వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని, లేకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న అఖిలపక్షం నేతలు వచ్చి కౌన్సిలర్‌ దంపతులను ఓదార్చారు. 
మరిన్ని వార్తలు