డెంగీతో అన్నదమ్ముల మృతి

15 Sep, 2016 23:54 IST|Sakshi

అనంతపురం సిటీ : అనంతపురం నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఎండీ ఇద్రీస్‌(12) , మహ్మద్‌ జునైద్‌(10)డెంగీతో గురువారం బెంగళూరులో మృతి చెందారు.  నాలుగురోజుల క్రితం ఇద్రీస్, అతని సోదరుడు జునేద్‌లకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన వైద్యుడు చిన్నారులను బెంగళూరుకు తీసుకువెళ్లాలని సూచించాడు. దీంతో వారిని బెంగళూరులోని నానో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం ఇద్రీస్, మహ్మద్‌ జునైద్‌ మృతి చెందారు. తన ఇద్దరు బిడ్డలకూ మాయదారి రోగం  సోకిందని వారిని బతికించేలా ప్రార్థించాలని  ఇద్రీస్‌ తండ్రి ఖలందర్‌ అనంతపురం నగరంలోని పలువురి వాట్సప్‌ ద్వారా సందేశం పంపారు. అయినా ఫలితం లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు విలపించారు.  అనంతపురం జిల్లా కేంద్రంలో డెంగీ కేసులు రోజుకొకటి నమోదవుతున్నా, గురువారం ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా తమకు సమాచారం తెలియదంటూ డీఎంహెచ్‌ఓ చెప్పడం గమనార్హం.  

మరిన్ని వార్తలు