కాకినాడ సిటీ :
అన్ని వర్గాల ప్రజలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి లావాదేవీలు జరపడం ద్వారా రుణాలు పొంది ఆర్థిక సామర్థ్యం పెంచుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ విధాన గౌతమీ సమావేశపు హాలులో లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజస్ ఇనీషియేటివ్స్ అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో డివిజన్, మండల, గ్రామ కేంద్రాల్లో ఆర్థిక సమీకృతంపై అవగాహన కల్పిస్తామన్నారు. జన్ధన్ యోజనలో ప్రతి పౌరుడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారే కానీ దానిలో లావాదేవీలు లేవన్నారు. ఖాతాలు తెరచి, పొదుపు చేయడం ద్వారా మూలధనం పెరుగుతుందన్నారు. ఆంధ్రాబ్యాంక్ ఎల్డీఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆర్థిక సామర్థ్యం, సమానత్వం, స్వావలంబనపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం సీహెచ్.సుగుణారావు, నాబార్డ్ ఏజీఎం కేవీఎస్ప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి, వివిధ బ్యాంకుల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
గిరిజన కుటుంబాలకు అదనంగా రెండు ఎల్ఈడీ బల్బులు
ఏజెన్సీ మండలాల్లోని 44,579 గిరిజన కుటుంబాలకు అదనంగా మరో రెండు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ అరుణ్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు లక్ష బల్బులను రంప గిరిజన మహిళా సమాఖ్య ఇండస్ట్రీయల్ కోఆపరేటివ్ సోసైటీ నుంచి ఏపీఈపీడీసీఎల్ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. మూడేళ్ల గ్యారంటీతో 9వాట్ల బల్బులను నవంబర్ 5లోగా సరఫరా చేయాలని సమాఖ్యకు సూచించారు.