అక్టోబర్‌ నాటికి టీచర్లకు ఏకీకృత సర్వీసులు

26 Jul, 2016 16:03 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పూల రాజేందర్‌

జోగిపేట: అక్టోబర్‌ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసులకు సంబంధించి ఉత్తర్వులు రానున్నాయని ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అన్నారు. సోమవారం జోగిపేటలోని  శ్రీ రామఫంక్షన్‌ హాలులో ఎంఈఓ పద్మ పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీసు రూల్స్‌ కోసం వేచిచూస్తున్నారని ఆ కల త్వరలో నెరవెరబోతుందన్నారు. ఈ విషయమై  ఈనెల 27న ఢిల్లీలో హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జవదేకర్‌తో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశమవుతారన్నారు. 

సర్వీసు రూల్స్‌కు న్యాయశాఖకూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని  ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రం అక్షరాస్యతలో మొదటి స్థానం వచ్చేలా పనిచేయాలన్నారు. 

పాఠశాలల్లో అటెండర్లు, నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా  పోస్టుల భర్తీకి గాను స్కూల్‌ గ్రాంట్‌ కింద నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించారన్నారు. ప్రభుత్వ పాఠశాలపై మంచి అభిప్రాయం కలిగేలా చూడాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అక్టోబర్‌లో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయని, ఇన్‌చార్‌్జల వ్యవస్థ పోతుందన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి మాట్లాడుతూ  కంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు  తెలిపారు.  దసరా నాటికల్లా ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ మొదలవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి నర్సింలు, పటేల్‌రాజేందర్, పీఆర్‌టీయు అందోలు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.మాణయ్య, ఎస్‌.నరోత్తం కుమార్, రాష్ట్ర, అసోసియేట్‌ అధ్యక్షులు జీ.లక్ష్మణ్, మధుసూదన్‌ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు కృష్ణ, డిప్యూటీ డీఈఓ పోమ్యానాయక్, ఎంపీడీఓ కరుణశీల తదితరులు కార్యమ్రంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు