మేనకోడలి భర్తను హత్య చేశాడు

26 Oct, 2016 20:35 IST|Sakshi
 
తెనాలిరూరల్‌: మద్యం మత్తులో వాగ్వాదం జరిగి మేనకోడలి భర్తను ఓవ్యక్తి హత్య చేశాడు. వివరాలు...తెనాలి చెంచుపేటలోని ఆర్‌పీఎం వెనుక రోడ్డులో నివసించే షేక్‌ బాజీ అలియాస్‌ రేపల్లె సుబాని(45) మంగళగిరిలో వెల్డింగ్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు. బాజీ  భార్య దరియాబి మేనమామ మస్తాన్‌వలి ఇక్కడి చంద్రబాబునాయుడు కాలనీలో నివాసం ఉంటున్నాడు. మస్తాన్‌వలీ  మంగళవారం రాత్రి బాజీ  ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ ఫూటుగా మద్యం సేవించి, బాజీ  ఇంటి వరండాలో నిద్రకు ఉపక్రమించారు. అదే సమయంలో  సంభాషించుకుంటున్న ఇరువురూ వాదులాటకు దిగారు. అది ఘర్షణకు దారితీయడంతో మస్తాన్‌వలి నైలాన్‌తాడును బాజీ  మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. దీంతో బాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. మస్తాన్‌వలి తెల్లవారు జామున త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి   బాజీ తనతో ఘర్షణ పడ్డాడని చెప్పాడు. అసలేం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా  జరిగిన ఘోరాన్ని తెలియజేశాడు. అయితే బాజీ పాతనేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. ఓ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడని, ఇటీవల భార్య దరియాబి, ఆమె తరపువారిపై దాడి చేసిన కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాడని తెలిపారు. ఈ క్రమంలో భార్యపై వేధింపులు ఎక్కువవడంతో హత్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఘటనాస్థలాన్ని త్రీ టౌన్‌ ఎస్‌ఐ పి. హజరత్తయ్య పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకుని, మతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు. మతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
 
 
 

 

మరిన్ని వార్తలు